పొంగులేటి పార్టీ మార్పుపై YS విజయమ్మ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
పొంగులేటి పార్టీ మార్పుపై YS విజయమ్మ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై వైఎస్ విజయమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పొంగులేటి తన కొడుకుతో సమానం అని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుడని, షర్మిల పార్టీలో చేరుతానని, షర్మిలకు అండగా ఉంటానని తన భార్యతో కలిసి వచ్చి మాట ఇచ్చాడని చెప్పారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయమ్మ మాట్లాడుతూ.. ఇచ్చిన మాటను పొంగులేటి నిలబెట్టుకుంటారని అనుకుంటన్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ టీపీ విషయంపై విజయమ్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వచ్చే ఎన్నికల నాటికి షర్మిల పార్టీ తెలంగాణలో బలంగా నిలబడుతుందని అన్నారు. అయితే షర్మిల తెలంగాణకు వస్తుందని తాను అనుకోలేదని కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్పారు. షర్మిల రాజకీయాల్లోకి వస్తుందని తాను ఏనాడు అనుకోలేదని తెలంగాణలో పార్టీ పెడతానని చెప్పినప్పుడు కష్టంగా ఉంటుందని మాత్రం చెప్పాన్నారు.

రాజశేఖర్ రెడ్డికి, వైసీపీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా మంచి సపోర్ట్ ఇచ్చిందని ఇప్పుడు షర్మిలమ్మకు కూడా మద్దతు ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో పులివెందుల ఎలాగో షర్మిలకు పాలేరు అలాంటిదని చెప్పారు. పాదయాత్ర అంటే పరుగు పందెం కాదని అన్నారు. పాదయాత్రలో ఎంత మందిని కలిశాం. ఎంత మంది కష్టాలు, బాధలు విన్నాం, ఎంత మంది పక్షాన మాట్లాడాం అనేది ప్రామాణికం అన్నారు.

ఇదిలా ఉంటే బీఆర్ఎస్‌పై అసమ్మతి రాగం వినిపిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ షర్మిల పార్టీలోకి వెళ్తారనే ప్రచారం ఇటీవల జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో పొంగులేటి వైఎస్సార్ టీపీలో చేరుతారని తనకు మాట ఇచ్చారని షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలను పొంగులేటి ఖండించారు. ఆ తర్వాత పొంగులేటి విజయమ్మను కలిసి పార్టీలో చేరే విషయంలో చర్చలు జరిపినట్లు ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే ఈ ప్రచారాన్ని కూడా శ్రీనివాస్ రెడ్డి కొట్టిపారేశారు.

విజయమ్మను కలిసిన మాట వాస్తవమేనని అయితే తన కూతురి వివాహ శుభలేఖ ఇచ్చేందుకే విజయమ్మను కలిశానని క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్ టీపీలో చేరే విషయంలో ఎవరితో చర్చలు జరపలేదని పొంగులేటి ఓ వైపు చెబుతుంటే మరో వైపు షర్మిల, విజయమ్మ మాత్రం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరుతానని మాట ఇచ్చారని పదే పదే ప్రస్తావిస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠగా మారుతోంది. ఇదిలా ఉండే పొంగులేటి క్రమంగా స్వరం పెంచుతున్నారు. బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తుతున్నారు.

Also Read...

MMTS-2కు కేసీఆర్ సహకరించడం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి


Next Story